Thursday 19 July 2018

డాక్టర్లపై ద్వేషం పెంచుకోవడం మంచిదేనా?

డాక్టర్లపై ద్వేషం పెంచుకోవడం మంచిదేనా? అనే అంశంపై నా అభిప్రాయం తెలిపే వీడియో ఇది. v9 చానల్ హెల్త్ వీడియోలలో ఇది 6వది. ఇంతక్రితం వీడియోల కోసం ఇక్కడ చూడండి.

Wednesday 18 July 2018

డాక్టర్లు వీరమాచనేనికి వ్యతిరేకమా? వీరమాచనేని డాక్టర్లకు వ్యతిరేకమా?


v9 చానల్ హెల్త్ వీడియోలలో భాగంగా డాక్టర్లు వీరమాచనేనికి వ్యతిరేకమా? వీరమాచనేని డాక్టర్లకు వ్యతిరేకమా? అనే అంశంపై నా అభిప్రాయం తెలిపే వీడియో ఇది. v9 చానల్ హెల్త్ వీడియోలలో ఇది 5వది. ఇంతక్రితం 4 వీడియోల కోసం ఇక్కడ చూడండి.
- పల్లా కొండల రావు.

Sunday 15 July 2018

నేను ‘మనము’లో ఒదగడమే ‘జనవిజయం’


నేను ‘మనము’లో ఒదగడమే ‘జనవిజయం’

    వ్యక్తికీ, సమాజానికీ ఉండాల్సిన సంబంధం గురించి చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం. వ్యక్తి గొప్పతనాన్ని ఎలా చూడాలి? వ్యక్తి దేనినైనా ఎవరికోసం సాధించాలి? అనేదే, లక్షలాది జీవరాసులలో మనిషి ప్రత్యేకత. మనసు ప్రధానమైన జీవి మనిషి. మనిషి యొక్క ఆలోచనా విధానమే మనసు. జీవులలో ఆలోచించగలిగేది మనిషి మాత్రమే. పాతదాని ఆధారంగా ఆలోచనా శక్తితో ఎప్పటికప్పుడు ఎలా మెరుగ్గా ఉండాలో శ్రమించి కొత్తది తయారుచేయగలిగేదీ, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగేదీ, మెరుగుపరచుకోగలిగేదీ మనిషే. ఇతర జీవరాసులలో ఈ మార్పుని చూడలేము. మనిషి సహజంగా సంఘజీవి. సమాజం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లలో మంచివి కొనసాగిస్తూ, మెరుగుపరచుకుంటూ, చెడ్డవి తొలగించుకుంటూ ఎప్పటికప్పుడు మెరుగైన, మేలైన సమాజం కోసం మనుషులు నిరంతరం జీవనపోరాటం చేస్తుంటారు. ఈ పోరాటంలో 'వ్యక్తి' పాత్ర ఏమిటి? ఎలా ఉండాలి? అనేదానిని బట్టి వ్యక్తి ‘విజయం’ ఆధారపడి ఉండాలి.

తాత్కాలిక భ్రమలు - శాశ్వత విజయాలు :
    ఓ వ్యక్తి తనకిష్టమైన రంగాన్ని ఎంచుకుని పనిచేస్తూ, సంతృప్తికరంగా ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఆ పనిలో సాధించే ఫలితాన్ని బట్టి సమాజంలో ఆ వ్యక్తి గొప్పతనం ప్రదర్శితమవుతుంది. ఏది గొప్ప? అనేది ఆయా సమాజాలను బట్టి చూసేవిగా కొన్ని ఉంటే, నిత్యసత్యాలుగా ఉండేవి కొన్ని ఉంటాయి. సమాజ లక్షణాలు కల్పించే భ్రమలో కొట్టుకుపోయేవి తాత్కాలిక గొప్పలు మాత్రమే. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పద్ధతిగా సాధించేవే అసలైన విజయాలు. ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో ఎలా సంపాదించినా సరే, డబ్బు సంపాదించినవారు గొప్పగా చూడబడుతుంటే, ఏ అవసరం తీరాలన్నా డబ్బు పాత్ర కీలకంగా మారినపుడు, మనమూ డబ్బు సంపాదించాలనే ఆలోచనకు రావడం సహజమే. కానీ డబ్బుని కొన్ని అవసరాల రీత్యా మనిషే సృష్టించుకున్నాడనేది సత్యం. ఈ డబ్బు మానవ సంబంధాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వాటిని అనివార్యంగా కాపాడుకోవలసిన మనిషి ఆ డబ్బునే రద్దు చేసుకునే దిశగా కొత్త ఆలోచనలు చేయక తప్పదనేది గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిణామాలను శాస్త్రీయంగా అంచనా వేస్తూ తాత్కాలిక భ్రమలకు లోనుకాకుండా శాశ్వత విజయాల కోసం ప్రయత్నించాలి.

ప్రత్యామ్నయం వచ్చేవరకే పాతదనం
         ఏదీ శాశ్వతం కాదు. మేలైనదీ, మెరుగైనదీ ప్రత్యామ్నయం కనుగొనగలిగినంత మేరకే పాతదాని మనుగడ కొనసాగుతుంది. ఒక సమాజంలో గొప్పదిగా చూడబడినది మరో సమాజంలో గొప్పది కాకపోవచ్చు. ఎపుడైనా, ఎక్కడైనా మేలైనదిగా ఉండే అంశాలే నిత్యసత్యాలు. అలాంటి నిత్యసత్యాలను నిలబెట్టేందుకు, ఆ సత్యాలకు విలువనిచ్చే సమాజం ఏర్పాటుకోసం ప్రయత్నించడమే మనిషి సాధించాల్సిన విజయం. ఆ క్రమంలో జీవన గమనం సాగిస్తున్నవారు తాత్కాలిక, భ్రమాత్మక గొప్పలతో సంతోషపడే వారికంటే గొప్పవారుగా చరిత్రలో మిగులుతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మార్పుకోసం అర్ధవంతంగా, సంఘటితంగా పోరాడడంలో పొందే సంతృప్తి మనిషికి అమితమైన ఆనందాన్నిస్తుంది. ఈ మార్గంలో ఓటమి కూడా విజయమార్గాలను సుగమం చేసుకోవడానికీ, ఓటమిని ఆనందంగా స్వీకరించడానికీ అంతులేని ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.

రెండు కీలక సంబంధాలు
శాశ్వత సత్యాలను గురించి ఆలోచిస్తే మనిషికుండే కీలక సంబంధాలుగా రెండింటిని చెప్పుకోవాలి. వీటిలో మొదటిది ప్రకృతితో సంబంధం, రెండోది సాటి మనుషులతో సంబంధం గా ఉంటాయి. మనిషి ఈ సంబంధాలు ఎలా కొనసాగిస్తున్నాడనేదానిని బట్టి తను విజయం వైపు పయనిస్తున్నదీ, లేనిదీ నిర్ణయించాలి. మనిషికి అన్ని అవసరాలు తీర్చేది ప్రకృతి కనుక ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రకృతి వనరులను పరిమితికి మించి వాడడం అనేది అందరికీ ఆపదను కలిగించేది కనుక అలాంటి చర్యను వ్యతిరేకించడం, ప్రకృతిని కాపాడే చర్యలను చేయడం అనేవి గొప్పపనులు అవుతాయి. ఓ మనిషి జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎదుగుదలలో తోటి మనుషులతో కలిసి వారి సహకారంతో, సహచర్యంతో నేర్చుకోవడం జరుగుతుంది. ఒంటరిగా జీవించడం అసాధ్యం కనుక అణచివేత, వివక్షత, నియంతృత్వం లేని ముఖ్యంగా.... కలసి ఉండే, కలుపుకుపోయే ‘మానవసంబంధాలు’ కోసం ప్రయత్నాలు చేయడం అనేది అన్నింటికంటే గొప్పపని అవుతుంది. మన జీవనం ఈ దిశగా ఉన్నదా? లేదా? అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పొరపాట్లను సవరించుకుంటూ ముందడుగు వేయాలి.

కొత్తదానికి ఆధారం పాతదే
    సహజంగా మనిషి ఆలోచనలను చుట్టూ ఉండే సమాజం, పరిస్థితులు ప్రభావితం చేస్తుంటాయి. ప్రస్తుత సమాజంలో వ్యక్తి విజయానికి కారణంగా ఆ వ్యక్తి కృషిని, ఆ వ్యక్తి సంపాదనను ప్రామాణికంగా చెప్తుంటారు, ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఓ వ్యక్తి విజయం సాధించడం జరిగిందీ అంటే తను అనుకున్నది సాధించడం జరిగిందని అర్థం. ఈ విజయంలో వ్యక్తి పాత్ర, సమాజం పాత్ర, పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నాయి? అనేది కూడా చూడాలి. ‘ప్రతి విజయంలో వ్యక్తి పాత్ర ఉంటుంది. కానీ ఏ విజయం అయినా ఒక వ్యక్తికి మాత్రమే చెందదు’. ఇది గుర్తించిన వ్యక్తి అసలు సిసలు విజేత. ఏ మనిషైనా, ఏ పనైనా ఇలా చేయాలీ... అని ప్లాన్‌ చేసుకోవడానికి ఆలోచన కీలకం. ఆలోచన కేవలం ఆ మనిషిదే అనుకుంటే పొరపాటు. గతంలో ఆ పనికి సంబంధించిన అనుభవాలు ఆధారంగా ప్రస్తుత అవసరాలను బట్టి ఒక మనిషి ఆలోచన చేయడం జరుగుతుంది. ఇప్పటి ఆలోచనలకు గత అనుభవాల సారం ఉపయోగపడిందంటే, గతంలో ఆ అనుభవాలు సాధించిన మనుషులు ఆలోచనలు ఇప్పటి మనిషికి ఉపయోగపడతాయంటే, ఇప్పటి ఆలోచనలు మెరుగ్గా ఉండడానికి గత ఆలోచనలు ఉపయోగపడ్డాయనేది గమనంలో ఉంచుకోవాల్సిన అంశం. అంటే ఇప్పటి ఆలోచన కేవలం ఇప్పటికిప్పుడే పుట్టింది కాదనేది నిజం. ఇప్పటి ఆలోచన ఇలా చేయగలిగిన వ్యక్తి పాత్ర గుర్తిస్తూనే, అదే సమయంలో ఆ వ్యక్తి శక్తికి పాత ఆలోచన సహకారం ఉందన్న సత్యాన్ని మరవకూడదు. ఏదైనా సరే, ఎపుడైనా సరే ఒక్కరిదే కాదనేది గుర్తుంచుకోవాలి. అందుకే ఒక మనిషి తాను ఎదగడానికి ప్రకృతి, సమాజం ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డాయో, తిరిగి వాటి మనుగడకు తాను అంతగానే సహకారం అందించాలి. ఇది ఒక మంచి సాంప్రదాయంగా, వారసత్వంగా కొనసాగాలి.

వ్యక్తిగత విజయాలు ఉండవా?!
          విజయం అంటే అందరిదీ లేదా కొందరిదీ అనుకుంటే విజయంలో వ్యక్తి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. విజయంలో వ్యక్తి పాత్ర తప్పక ఉంటుంది. ఒక గ్రామంలో అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనేది ఓ లక్ష్యం అయితే, ఆ ఆలోచన అందరికీ రాకపోవచ్చు. కొందరికే రావచ్చు. ఆ కొందరిలో ఒక్కరే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. వారే నాయకులుగా ఉంటుంటారు. అంటే ఒక వ్యక్తి విజయంలో భాగస్వామి కాగలడని మాత్రమే చెప్పగలిగినా, మిగతా వ్యక్తులకంటే భిన్నంగా నాయకుడిగా ఉండగలగడమనేది వ్యక్తిగత విజయంగా చెప్పవచ్చు. వ్యక్తిగత క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకోవడం వంటి లక్షణాలను జీవితాంతం సాధన చేయడంలో వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య తేడా ఉంటుంది. వ్యక్తిగత విజయం అనేది విజయంలో భాగంగా ఉంటుందని గుర్తించగలిగినవారే నిజమైన 'విజేత'గా గుర్తించబడతారు. ఎప్పటికీ అన్ని విషయాలలో మనుషులంతా సమానం అనేది అసాధ్యం. కానీ మనుషులందరూ సమాన అవకాశాలను కలిగి ఉన్నపుడు మనుషుల మధ్య సమాజం సృష్టించిన అంతరాలు తొలగిపోతాయి.

గెలుపుకీ, విజయానికీ తేడా
    ఇతరులను ఓడించడం ద్వారా సాధించేది గెలుపు. గెలుపులో ఒకరిద్దరు గెలిస్తే చాలామంది ఓడిపోతారు. విజయంలో అయితే అందరి కోసం అందరూ కలిసి సాధిస్తారు. ఓ పరుగుపందెంలో 100 మంది పాల్గంటే మొదటి, రెండవ స్థానాలో గెలిచినవారు మిగతా 98 మందిని ఓడిస్తారు. ఓ గ్రామంలో అందరినీ అక్షరాస్యులుగా చేయాలనే తలంపుని ఆచరణలో విజయంగా మలచాలనుకుంటే మరికొందరి సహకారంతో ఆ గ్రామంలో అందరినీ అక్షరాస్యులుగా తయారుచేయవచ్చు. ఇక్కడ అందరినీ అక్షరాస్యులుగా తమారుచేయాలనే ఆలోచన ఓ వ్యక్తిది. ఆ ఆలోచన ఆ వ్యక్తికి రావడానికి చదువు విలువని అతను గుర్తించడమే కారణం. అతనికి చదువు నేర్పిన గురువుల వల్ల, చదువుతో అతను పొందిన మార్పుల వలన, ఇతరులు ఆ విజయాల్ని, ఆనందాల్ని పొందాలన్న ‘లక్ష్యం’ ఏర్పడడానికి కారణం అయింది. ఇది మరికొందరికి ప్రేరణ కలిగించవచ్చు. ఇదే మనుషుల మధ్య ఉండే, ఉండాల్సిన సంబంధాలలో కీలకమైనది. ఆ లక్ష్యం నెరవేరాలంటే మరికొందరు అక్షరాలు నేర్పే గురువులుగా సహకారం అందించేవారు, అక్షరాలు నేర్చుకున్న విద్యార్థులంతా కలిస్తేనే సాధ్యం.ఆ లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి దానిని సాధించామన్న సంతృప్తి, ఆనందం పొందాలంటే ఇందరి తోడ్పాటు తప్పక అవసరం. ఒక విజయంకు సంబంధించిన పరిపూర్ణత అనేది ఒక్కరిగా కంటే కొందరిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా వ్యక్తి కంటే సమూహం యొక్క శక్తి గొప్పది. ఐక్యతకు, సంఘటితానికి ఉన్న శక్తి, అవకాశాలు, వ్యక్తి శక్తి కంటే ఎపుడూ మెరుగ్గానే ఉంటాయి.

నేను-నేనే
              ‘నేను’కు ‘నేనే’కు తేడా తెలుసుకుంటే ‘మనము’ విలువ తెలియడంతో పాటు ‘నేను’ వర్ధిల్లుతుంది. 'నేను' ఉంటుంది, ఉండాలి కూడా. నేను అనేది లేకపోతే మనిషిలో ఎదుగుదల ఉండదు. ‘నేను సాధించాలి’, ‘నేను చేయగలను’ అనే ఆత్మ విశ్వాసం ఉండి తీరాలి. విజయాన్ని సాధించే క్రమంలో వివిధ ‘నేను’ల మధ్య నైపుణ్యాల విషయంలో తేడా ఉంటుంది. ‘నేను’ల  మధ్య ఈ తేడా, ‘నేను’కు ‘నేనే’కు ఉండే తేడా ఒకటి కావు. ‘నేను’ అనేది ‘సాధించాలి’ అనే తపనను కలిగి ఉంటే ‘నేనే’ అనేది ‘నేను మాత్రమే సాధించాలి’ అనే స్వార్థాన్ని కలిగి ఉంటుంది. నేనే అనేది ఇతరులు సాధించకుండా అడ్డుపడే ఈర్ష్య,అసూయ,ద్వేషం,పగలను రగిలిస్తుంది. నేను ఎదగడానికి ఉన్న అవకాశాలను గుర్తించే శక్తినీ, సమయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. నేను అనేది ఉండాలి, ఉంటుంది. కానీ అది మనములో ఒదిగి ఉండాలి. ‘నేను' 'మనము'లో ఒదిగి ఉండడమే 'జనవిజయం’. 
                'భువన విజయం' సభలో ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభికుల ముందు ఓ సమస్యనుంచారు. ఆ సమస్య ‘‘ఎవరు స్వర్గానికి వెళతారు?’’ అని. ఒక్కడు తప్ప మిగతా సభికులంతా రాజుని పొగుడుతూ మీరు కన్నబిడ్డల్లా ప్రజలను పాలిస్తున్నారు. స్వర్గానికెళ్లే అర్హత రాయలుకు తప్ప అక్కడెవ్వరికీ లేదని తేల్చారు. సభలో మౌనంగా ఉన్న ఆ ఒక్కడు రామలింగడు. దీనిని గమనించిన రాయలు ఏమి రామలింగ కవీ! మీరు మిన్నకున్నారు? మీ అభిప్రాయమేమిటి? అని అడిగితే, రామలింగడు తడుముకోకుండా ‘బహుశా నేను పోతే పోవచ్చు’ మహారాజా! అన్నాడు. సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అంతా రాజు స్వర్గానికి వెళతాడంటుంటే, రామలింగడేంటి తను స్వర్గానికి వెళతానంటున్నాడని ఆశ్చర్యపోతున్న సమయంలో రాయలు కల్పించుకుని ‘మహాకవీ! మీ మాటలోని ఆంతర్యాన్ని విశదంగా చెప్పగలరా? అని అడుగగా, రామలింగడు ఇలా వివరించాడు. ‘‘నేను అనే  అహంకార స్వభావం ఎవరిలో అయితే పూర్తిగా తొలగి పోతుందో, అట్టి ప్రతి ఒక్కరూ స్వర్గానికి వెళతారు’’ అన్నాడట. రాయలుతో సహా సభికులంతా రామలింగడి ప్రతిభను మెచ్చుకున్నారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ‘నేను’ అనేది ‘అహం’గా కాకుండా ‘ఆత్మ విశ్వాసం’గా ఉంటే ఉపయోగంగా ఉంటుంది.

‘మనము’ అవసరాలు-అవకాశాలు-ఆటంకాలు:
       నేను సాధించింది ఎవరికోసం? ఒక నేను బాగా పాడగలిగితే, ఆ ‘నేను’ పాడిన పాట ఎవరైనా విని ఆనందించినపుడు మాత్రమే ఆ ‘నేను’ కు సంతృప్తి కలుగుతుంది. ఇక్కడ ‘నేను’ కు సంతృప్తి కలగాలంటే ‘మనము’ అవసరం. ఓ వ్యక్తి పుట్టగానే అన్నీ నేర్చుకోలేడు. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనిషి ఎదగడానికి తల్లి నుండి సమాజంలోని వివిధ సంబంధాలు, ప్రకృతి అనేక విధాలుగా సహాయపడతాయి. ఈ సంబంధాల ఆధారంగా ఎదిగిన వ్యక్తి తిరిగి ఆ సంబంధాల కోసం, ప్రకృతికోసం తాను సాధించింది ఉపయోగించాలి. తల్లి అనేది సహజ సంబంధం. కుటుంబం, వావి వరసలు అనేవి మనిషి కట్టుబాట్లు కోసం ఏర్పరచుకున్న మానవ సంబంధాలు, న్యాయం, చట్టం, రాజ్యాంగయంత్రం, కొన్ని సాంఘిక కట్టుబాట్లు కూడా వివిధ పరిస్థితులో మనిషి ఏర్పాటుచేసుకున్నవే. వీటిలో ఏవి సహజమైనవి? ఏవి అసహజమైనవి? ఏవి అవసరం? ఏవి అనవసరం? అనేవి తేల్చుకునే మంచి ఆలోచన వైపు ‘నేను’ ఉండాలి. అలాంటి ‘నేను’ల  సంఖ్య పెరిగితే ‘మనము’ బాగుంటుంది. ‘నేనే’ల సంఖ్య పెరిగితే, ఆ సమాజంలో అశాంతి, అసమానతలు, ఎక్కువవుతాయి. కావున ‘నేను మనములో ఒదిగి ఉండేలా సమాజాన్ని తమారుచేసేలా కృషి జరగాలి’. పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానదు. పుట్టి గిట్టేలోగా సాగించే జీవన గమనంలో మనిషి చేయాల్సింది ఏమిటి? సమాజంలో ఒక మనిషి జీవితంలో అవసరమయ్యేవి ఏవి? అనవసరమైనవి, ఆటంకాలుగా ఉండేవి ఏవి? మనము యొక్క అవసరాన్ని గుర్తించి, మనముకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ, ఆటంకాలను అధిగమిస్తూ ఉండాలి. ఈ ఆలోచన సవ్యంగా, సమైక్యంగా ముందుకు సాగేలా చేయగగాలి.

మనము కోసం మనతో మనమే పోరాడాలి
       ‘మనము’కు, ‘నేను’కు ఆటంకం కలిగించేవి ఏమిటి? ఇక్కడా రెండే ఉంటాయి. మొదటిది ప్రకృతి, రెండోది మనిషి. అంటే మనిషి పోరాడాల్సింది కూడా మనిషి కుండే రెండు సంబంధాలతోటే. ప్రకృతి వైపరీత్యాలను శాస్త్ర విజ్ఞానాన్ని వృద్ధి పరచుకోవడం ద్వారా ఎదుర్కోగలం. ఇది నిరంతర ప్రక్రియ. వివిధ భావజాలాలు వివిధ సమూహాలుగా ఏర్పడతాయి. వీటిలో మనమును శాశ్వతంగా నిలబెట్టే భావజాలం తాత్కాలికంగా తక్కువ బృందంగా ఉన్నా శాశ్వతంగా విజయం సాధించాలంటే మనమును కాపాడగలిగే భావజాలాన్ని వ్యాపింపజేయగలిగిన ఓ బలమైన శక్తిని, సమూహాన్ని నిర్మించుకుంటూ పోవాలి. ఈ క్రమంలో మనుషుల మధ్య పోరాటం, సంఘర్షణ అనివార్యం. ఉదాహరణకు స్త్రీలను తక్కువగా చూడడం అనేది ఇంటి నుండే అలవాటైతే మనిషి మానసిక వికాసం ఎదుగుతున్న కొద్దీ స్త్రీని మనిషిగా చూసే మానవత్వం పెరగాలి. ఇందుకు వ్యతిరేకించే మనుషులతో పోరాడక తప్పదు. రక్షణ విషయంలో పోలీసులు, సైన్యం దేశాల సరిహద్దులు అవసరం లేని ‘వసుదైక కుటుంబపు ప్రపంచం’ ఏర్పాటు దిశగా పోరాడి సాధించుకోవాలి. ఈ పోరాటం ఈ అంశాలను వ్యతిరేకించేవారితోనే చేయాలి. అంటే మనము కోసం మనతో, మనమే పోరాడాలి. ఈ పోరాటం 'ఇంటి నుండి మింటి వరకు' అన్ని అంశాలలో ఐక్యతగా జరగాలి.

పోరాట వ్యసనం మంచిది కాదు
      మనం మనతోనే పోరాటం అంటే మనుషులతోనే అయినపుడు అది వ్యసనంగా కాక క్రమానుగతంగా జరగాలి. జనాన్ని వీలైనంత మేరకు మార్చుకుంటూ పోవాలి. జనం కోసం చేసే పోరాటం తగినంత బలం లేకుండా చేస్తే సాధించిన ఫలితం సమర్థవంతంగా అమలు చేయడంలో ఇబ్బందులుంటాయి. జనాన్ని మార్చే క్రమంలో పోరాటం ఆరాటంగా ఉంటే నష్టమే తప్ప ప్రయోజనం తక్కువ. అవసరమైపుడు, అనివార్యమైనపుడు చేయాల్సిన పోరాటపద్ధతికి, పోరాటం కోసం పోరాటం చేసే దానికీ (పోరాట వ్యసనం) తేడా ఉంటుంది. ఎక్కడ ఏ పరిస్థితులలో ఏ పోరాటపంథా ఉండాలనేది వివిధ అనుభవాలను పాఠంగా తీసుకుని ఎత్తుగడలు వేసుకోవాలి. అన్నింటికీ ఒకే మూస పద్దతి, పుస్తకాలను బట్టీపట్టి, చరిత్రను మక్కీకి మక్కీ అనుసరించడం మారిన పరిస్థితులను, మార్పు క్రమాన్ని అంగీకరించని అతివాదం లేదా మూర్ఖత్వం అవుతుంది. అధ్యయనం-ఆచరణ-అనుభవం-పాఠాలు అనేవి ఓపికగా, ఒద్దికగా చేయాల్సిన, నేర్వాల్సిన, అనుసరించాల్సిన అంశాలు.

‘వసుదైక కుటుంబం’ అసాధ్యమా?!
     వసుదైక కుటుంబం అసాధ్యమా? మనిషి అసాధ్యం అనుకున్నవి ఎన్నో సుసాధ్యం చేసుకున్నాడు. ఒకప్పుడు ఆలోచనకు సైతం అందని అద్భుతాలను ఆవిష్కరించగలుగుతున్నాడు. కనుక వసుదైక కుటుంబంలా ‘ఒకే కుటుంబం-ఒకే ప్రపంచం’ అనే భావన, భావనగా మాత్రమే కాక ఆచరణలో సాధ్యం కాకపోవడం అంటూ ఉండకూడదు. ఎప్పటికపుడు మేలైన, మెరుగైన సమాజం వైపు మానవులు ప్రయత్నిస్తూ, విజయాలు సాధిస్తూ ఉంటారు. ఆ దిశగా మంచి ఆలోచనలు, సమైక్య పోరాటాలు సాగాలని, విజయాల పరంపర కొనసాగుతుండాలని, ప్రపంచ మానవులంతా ఒకే కుటుంబంలా జీవించగలిగే ఉన్నత సమాజంకై నిరంతరం ప్రయత్నిద్దాం.అపుడే జనులంతా విజయం సాధించినట్లవుతుంది. ‘జనవిజయం’ వర్ధిల్లుతుంది. 

- పల్లా కొండరావు.
15-07-18
('జనవిజయం వీక్లీ' కోసం జనవిజయం కాన్సెప్ట్ గురించి గతంలో నేను వ్రాసిన వ్యాసం)

Tuesday 10 July 2018

v9 హెల్త్ వీడియోలు - వీరమాచనేని విధానం - నా అభిప్రాయాలు (4 వీడియోలు)

వీరమాచనేని ఆహార విధానం శాస్త్రీయతపై నా అభిప్రాయం. వి9 చానల్ హెల్త్ వీడియోలలో భాగంగా ఇంతక్రితం 3 వీడియోలు తయారు చేశారు. అవి పల్లెప్రపంచం సైట్ లో ఉంచాను. ఆ 3 వీడియోలను కూడా ఈ బ్లాగులోకి బదిలీ చేశాను. ఇది 4వ వీడియో. తడుపరి వీడియోలను వరుసగా ఈ బ్లాగులో ఉంచుతాను. మీ అభిప్రాయాలూ , సూచనలూ తెలియజేయండి.

v9 నాలుగవ వీడియో
v9 మూడవ వీడియో v9 రెండవ వీడియో v9 మొదటి వీడియో

రోజు రోజుకు క్రమ క్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిద్దాం


"రోజు రోజుకు క్రమ క్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిద్దాం"

ఈ వాక్యం చాలా కీలకమైనదిగా భావిస్తాను. 

పుస్తకం పేరు గుర్తులేదు కానీ...... వ్యక్తిత్వ వికాసం కు సంబంధించి నేను చదివిన వాక్యం బాగా ప్రభావితం చేసింది.  "EVERY DAY IN EVERY WAY I AM GETTING BETTER AND BETTER". తెలుగులో దీనర్ధం "రోజు రోజుకూ క్రమ క్రమంగా అన్నింటా నేను అభివృద్ధిని సాధిస్తాను". 'నేను' అనే స్థానంలో 'మనం'ను చేర్చడం సరయినదనేది నా అభిప్రాయం. ఓ వ్యక్తి ఏది సాధించినా దాని వెనుక చాలామంది సహకారం ఉంటుంది. విజయం ఎపుడూ 'జనవిజయం' గానే ఉంటుందని నమ్ముతాను. వ్యక్తి టేలంట్ ఇంప్రూవ్ కావాలన్నా 'నేను' కు 'మనం' తోడూ కావాల్సిందే. ఈ నేపధ్యంలో  ఆ వాక్యాన్ని ఇలా మార్చుకున్నాను.

"EVERY DAY IN EVERY WAY WE ARE GETTING BETTER AND BETTER"


ప్రతి వ్యక్తీ ఎదో ఒకటి ‘సాధించడం’ లేదా ‘ఎదగడం’ ను కోరుకోవడం సహజం. సమాజం గొప్పగా గుర్తించాలనే తపన ఉండడం సహజం. అనుకున్నది సాధించే క్రమంలో ఎవరైనా విజయం సాధించాలనే కోరుకుంటారు. చాలామంది విజయం వస్తే పొంగిపోవడం, అవరోధాలు, ఆటంకాలు ఎదురైనపుడు పక్కదోవపడుతుంటారు. ఈర్ష్య, అసూయ, కోపం, ఆందోళన, డిప్రెషన్, నిరాసక్తత, నిర్లిప్తత….ముదిరితే కక్ష పెంచుకోవడం వంటి అనేక అసహజమైన మానసిక జాడ్యాలు కలిగే అవకాశం ఉంది. ఏదీ సాధించకపోయినా మంచిదే కానీ నెగెటివ్ జాడ్యాలు వంటబట్టడం మాత్రం మంచిది కాదు. విజయం సాధించే క్రమంలో కొన్ని అనుభవపూర్వకమైన అంశాలను గమనంలో ఉంచుకుంటే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు

జయమైనా, అపజయమైనా దానిలోనుండి పాఠాలు నేర్చుకోవాలి. విజయం సాధిస్తే కేవలం మన టేలెంట్ మాత్రమే అనుకోకుండా సహకరించిన వ్యక్తులు, అనుకూల అంశాలను గమనంలో ఉంచుకోవాలి. మరో విజయానికి అది ప్రేరణగా ఉండాలి. అపజయం సాధించినా ఇదే క్రమంలో విశ్లేషణ చేసుకోవాలి. మన పనులనుండే కాదు, ఇతరుల జయపజయలనుండీ పాఠాలు నేర్చుకోవాలి. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడం ఎవరికీ సాధ్యం కాదు. మనం దేనినైనా సాధించాలంటే ఆ సాధించేది ఎవరికోసం? ఎలా? అన్నది గుర్తుంచుకోవాలి.

మనిషి జీవితమే ఒక ప్రాసెస్. చిన్న పిల్లవాడినుండి ఎదగాల్సిందే ఎవరైనా. తప్పులు చేస్తూ, తప్పటడుగులు వేస్తూ  పడుతూ, లేస్తూ ఎదిగి నడుస్తూ.... 'అవసరమైన మేరకు పరుగు' నేర్చుకోవలసిందే. అసలు ప్రకృతిలో ప్రతీదీ ఓ ప్రాసెస్ గా పద్దతిగా జరుగుతున్నది. అది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మాలకు లోబడే మనిషి జీవిత ధర్మాలూ ఉండాలి. కాబట్టి క్రమంగా ఎదగడం అన్నది ఓ సూత్రం మాత్రమే కాదు 'ధర్మం' అని కూడా గుర్తించాలన్నది నా అభిప్రాయం. అలాగే ఏదైనా మరొకదానితో సంబంధం కలిగి ఉన్నట్లే మనిషి కూడా నిరంతరం ప్రకృతితో తోటి మనుషులతో, సంబంధం కలిగి ఉండడం ఓ కీలక ధర్మం.

ఏ ఒక్కరూ.. ఒక్కరిగా మాత్రమే దేనినీ సాధించలేరు. సాధించేది కేవలం వ్యక్తికోసమే కాదు, సమాజం కోసం కూడా... అన్నది గుర్తుంచుకోవలసిన మరో కీలక అంశం. ‘నేను’ సాధించేది ‘ఇతరుల’ కోసమే, 'నేను' కు గుర్తింపు నిచ్చేది... ఇవ్వాల్సిందీ.. ‘ఇతరులే’, సహాయపడేది ‘ఇతరులే’ అన్నది గుర్తుండాలి. ‘నేను’ సాదించేది ‘మనం’ కోసమే. ప్రతిది పరిస్తితులు, కాలము, ప్రదేశం పై ఆధారపడి ఉంటాయి. కనుక అవరోధాలు ఎదురైనపుడు వాటిని జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. అసహజమైన జాడ్యాలకు లోనుకాకుండా ఎక్కడ లోపం జరిగింది? ఎందుకు జరిగింది? మరోసారి ఆ తప్పు జరుగకుండా ఏం చేయాలి? అన్నది ఆలోచించాలి. 

ప్రతిరోజూ నిన్నటి మనతో నేటి మనని పోల్చుకుంటూ ప్రయత్నం విడువకుండా లోపాలు సరిచేసుకుంటూ ముందడుగు వేయడమే మనం చేయగలిగిన, చేయాల్సిన పని. ఇతరులకు సహాయపడుతూ, ఇతరుల సహాయం పొందుతూ అందరితో కలసి మనం అభివృద్ధి చెందడం 'అలవాటు'గా మార్చుకోవాలి. అందరి సహకారంతో అందరికోసం విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకోవాలి. వ్యక్తిగతంగా మనలో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ఎప్పటికపుడు పదును పెడుతూ క్రమ క్రమంగా అవసరమైన అన్నింటా ముందడుగు వేయాలి.

ప్రారంభించిన వెంటనే ఫలితం కోసం ఆశించకుండా, అపజయం ఎదురైతే అనుభవపాఠం నేర్చుకుంటూ అనుకున్న లక్ష్యం దిశగా ప్రయత్నించాలి. గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఫలితం గురించి దిగులుపడకుండా నిరంతరం కొత్తకోణంలో ప్రయత్నించడమే మనపని. ప్రతిరోజూ మనకు నేర్చుకోవడం అనేది ఓ అలవాటుగా మారాలి. మన జయాపజయాలనుండి, ఇతరుల జయాపజయాలనుండి పాజిటివ్ దృక్పథంతో నేర్చుకుంటూ ఎదగాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అందరికీ సహాయపడేలా, అందరిలో ఒకరిగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. అందుకే ‘రోజు రోజుకూ క్రమ క్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిద్దాం’.

– పల్లా కొండల రావు,
10 జులై, 2018.

Sunday 8 July 2018

వేగం గమనంలో ఉండాలి


వేగం గమనంలో ఉండాలి

నేటి మానవ జీవితంలో వేగం పెరిగింది. అది అవసరానికి మించి ఉంటోంది. శృతి మించిన వేగం మనిషిని అనేక విధాలుగా నష్టపరుస్తోంది. వేగం వలన కలిగే మంచిని ఉపయోగించుకోవాల్సిందే. అవసరమైన చోట వేగం కొనసాగించాలి. కానీ అదే వేగం మనిషి తత్త్వానికి, మానవత్వానికే 'సవాల్‌'గా మారితే ఏం చేయాలి? ప్రస్తుతం చాలా విషయాలలో వేగం శృతి మించుతోంది. వేగం మనిషిని అతలాకుతం చేస్తోంది. మనసును కల్లోలపరుస్తోంది. మానవ సంబంధాలను మంట గలుపుతోంది. అందరం ఆగి చూసుకోవసిన అవసరం ఉంది. మనం అవసరమైన వేగం కొనసాగిస్తున్నామా? అవసరానికి మించిన వేగంలో మునిగిపోతున్నామా? అనేది తేల్చుకోవలసి వచ్చింది.

మనిషికి జ్ఞానం ఎదిగే కొద్దీ బుద్ధి తగ్గుతోందనిపిస్తోంది. మనిషి అవసరాలకోసం తాను సృష్టించిన డబ్బుకు బానిసగా మారాడు. డబ్బు కోసం పరుగులు పెడుతున్నాడు. డబ్బు ఆడించినట్లల్లా ఆడుతున్నాడు. జీవితాన్ని నిత్యం పరుగెత్తిస్తున్నాడు. డబ్బు కోసం సృష్టించబడిన 'సరుకుమాయ'లో పడిపోతున్నాడు. డబ్బు సృష్టించే సమస్యతో సతమతమవుతున్నాడు. డబ్బు సంపాదించడం కోసం పోటీపడుతున్నాడు. అవసరం కోసం కొందరు, ఆధిపత్యం కోసం కొందరు ఎలా అయితేనేం డబ్బు మనిషిని, మనసును స్థిమితంగా ఉంచడం లేదు. పరుగు పెట్టిస్దోంది. ఈ క్రమంలో మనిషికి రానురాను మెదడు పెరుగుతోంది, కానీ హృదయం తరుగుతోంది. ఏది గొప్పది? ఏది సాధించాలి? ఏది సంతృప్తినిస్తోంది? అనేదానికి అర్ధం లేకుండా పోతున్నది. అర్ధం మారిపోతున్నది. అర్ధం కాకుండా పోతున్నది. ఇలా ఎందుకు జరుగుతోందనేది అర్ధం చేసుకోవడానికి మనిషికి సమయం సరిపోవడం లేదు. అంతా బిజీ, గజిబిజి. జీవితం ఉరుకుల, పరుగుల ప్రయాణంగా మారింది.

ఎప్పటికపుడు పాతరోజులే బాగున్నాయని అనుకుంటూ జీవితాన్ని నిట్టూర్పుతో నెట్టుకొస్తున్నారు కొందరు. ఇంకా పాత చింతకాయపచ్చడేంటంటూ ఉరుకులెత్తుతున్నారు కొందరు. ఏది పాతది? ఏది కొత్తది? అన్నది కాదు కావలిసింది. ఏది మంచిది? ఏది కొనసాగించాలి? ఏది ఎలా మార్చుకోవాలి? అన్నది ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ దిశగా ఆచరణ ఉండేలా అడుగులు వేయాలి. నిజానికి జీవితంలో ఎపుడూ పాతకొత్తల మేలు కలయికే మంచి ఫలితాలని ఇస్తుంది. నేటి సమాజంలో ఎవడి గోల వాడిది. ఎవడి గోల్‌ వాడిది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అందరూ ఎవరి బిజీలో వారుంటున్నారు. తనను తాను గానీ, తనవాళ్ళను గానీ పట్టించుకోలేనంత బిజీతో సంపాదించేది దేనికోసం? ఎవరి కోసం? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆ దిశగా ఆలోచించే సమయం కూడా ఉండడం లేదు.

మానవ సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. పలకరింపులతో సహా అన్నింటా వ్యాపారతత్త్వం పెరిగిపోతుండడం బాధాకరం. అంతా బాగేనా? అనే పలకరింతలో బాగా సంపాదిస్తున్నారా? అనే అర్ధమే ఉంటోంది. ఒకపుడు అంతా బాగేనా? అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంతా బాగుందా? అని అర్ధం చేసుకునేవారు. నేటి పలకరింపుకు అర్ధం మారింది. భార్యా, భర్తలిరువురూ సంపాదిస్తే తప్ప ఇలలు గడవడం లేదు. ఈ క్రమంలో బాల్యం బందీ అవుతోంది. వృద్ధాప్యం శాపంగా మరింది. పల్లెలనుండి వలసలు పెరుగుతున్నాయి. ఉమ్మడి తత్త్వం మంట గలిసిపోతోంది. ఆటపాటలు, మంచి చెడు, పండుగలు, పబ్బాలు..... అన్నింటా కొత్త సంస్కృతి వచ్చేస్తోంది. అడుగడుగునా అన్నీ ‘సరుకు’లుగా మారిపోతున్నాయి. ప్రతిదీ డబ్బుతోనే కొనుక్కోవచ్చు. ఏర్పాటుచేసుకోవచ్చనే దుస్థితికి వచ్చేస్తున్నాము. ఏ 'విలువలూ' 'విలువ’ గా మారకుండా ఆపలేకపోతున్నామా? మనిషి మనిషిగా కాక వినియోగదారుడిగా మారిపోతున్నాడు. సరుకుమాయలో పడిపోతున్నాడు. అనివార్యంగా మార్చబడుతున్నాడు. బంధాలు, బంధుత్వాలే కాదు, వ్యక్తిగతంగా కనీసం తన ఆరోగ్యంను సైతం తాను కాపాడుకోలేనంత వేగంగా సంపాదించే యంత్రంగా మారిపోతున్నాడు. ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతున్నారు.

ఈ పరిస్థితి మారాలి. మనిషి 'మనిషి'గా మారాలి. మనసును ‘సరుకుమాయ’కు లోనుకాకుండా చేసుకోవాలి. మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడుగా, నీడగా నిలచే మానవ సంబంధాలను, విలువలను కాపాడుకోవాలి. మనిషి తాను సృష్టించిన డబ్బుకు బానిసగా మారకుండా, డబ్బునే తన బానిసగా చేసుకునేంతగా ఎదగాలి. మనిషినీ-మనిషినీ, మనిషినీ-మనసునూ విడదీసే డబ్బుకోసం అవసరానికి మించిన పరుగులు తీయడం మానుకోవాలి. విజ్ఞత, వివేకం కోల్పోని సమిష్టి తత్వ్తాన్ని పెంచుకోవాలి. నలుగురితో కలిసి ఉండడం, నలుగురి కోసం ఉండడం నేర్చుకోవాలి. అందులో ఉండే అసలైన ఆనందాన్ని ఆస్వాదించగగాలి. అందుకే వేగం గమనంలో ఉండాలి.

- పల్లా కొండల రావు,
౦8 జులై, 2018.

( జనవిజయం వీక్లీ ఎడిటోరియల్ కోసం వ్రాసినది )

Saturday 7 July 2018

'నేనూ' చెప్పదలచుకున్నాను!


'మై వాయిస్' కు స్వాగతం!

బ్లాగు అనే మాధ్యమం 2011 లో నాకు పరిచయమైంది. అరవింద్ ద్వారా బ్లాగు అంటే ఏమిటి? ఎలా క్రియేట్ చేయాలి?  వంటి విషయాలు నేర్చుకున్నాను. బ్లాగు ప్రపంచం లో అగ్రిగేటర్లు గురించి తెలిసాక వాటి ద్వారా ఇతర బ్లాగులు చాలా చూడడం జరిగింది. అనేక బ్లాగులనుండి, బ్లాగర్లనుండి,  గూగుల్ ప్లస్ మిత్రులనుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్లాగు ప్రపంచంలో నా అనుభావాలు గురించి పల్లెప్రపంచం బ్లాగులో వ్రాశాను. కొందరు బ్లాగర్లను ఇంటర్వ్యూ చేసాను. ప్రశ్నిస్తే మీ అభిప్రాయాలు పంచుకున్నారు. జనవిజయం కు మీ వ్యాసాలు వ్రాశారు. తెలుగు-వెలుగు కు సహకారం అందించారు. నచ్చిన పాటలు తెలిపారు. పల్లెప్రపంచం  కార్యక్రమాలను ఆదరించారు. ఇలా నేనే ప్రయోగం చేసినా ఆదరించారు. ఆ మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు.

బ్లాగు ప్రపంచంలోనూ బయట ప్రపంచంలో మాదిరిగానే ఆటంకాలు కల్పించేవారూ, ఈర్శ్యాపరులూ, అపార్ధం చేసుకునేవారూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల వల్ల నేను ఇబ్బందిగా ఫీల్ అయి 'ప్రజ' తో సహా నేను నడిపే అన్ని  బ్లాగులు రద్దు చేసుకుని అన్నింటిలోని ముఖ్యమైన పోస్టులు 'పల్లెప్రపంచం' బ్లాగులోకి మెర్జ్ చేశాను. ఆ సందర్భంలో 'ప్రయాణం' అనే పేరుతొ ఉన్న ఒక బ్లాగును కూడా 'పల్లెప్రపంచం' లోకి  కలిపేశాను. ఇది అయిష్టంగా చేసిన పని. మిగతా అన్ని అంశాలూ విడి విడిగా ఉన్నవి అన్నీ కలిపి 'పల్లెప్రపచం' బ్లాగులో ఉంచడం వలన నష్టం లేదు. కానీ 'ప్రయాణం' లో కేవలం వ్యక్తిగతంగా వ్రాసుకోవడానికి స్టార్ట్ చేసినది రద్దు చేయడం అసంతృప్తిగా ఉండేది.

ఎవడో ఎదో అన్నాడని మనకు ఇష్టమైన పని మానుకోవడం తప్పేనని తెలుసు. తెలిసి తెలిసి ఆ తప్పు ఎందుకు చేయాలి? అలా విమర్శలు చేయడం వలన మిగతా బ్లాగులన్నీ ఒకేచోట కలపడం వలన నాకు ఉపయోగం జరిగింది. వ్యక్తిగతంగా నేను వ్రాయదలచుకున్నవీ, వివిధ అంశాలపై నా అభిప్రాయాలూ, నా వ్యక్తిగత అనుభవాలు, మొత్తంగా నేను చెప్పదలచుకున్నవి 'ప్రయాణం' బ్లాగులో వ్రాయాలనుకున్నాను. కానీ కేవలం 3 పోస్టులతో అపుడా ప్రయాణం ఆగింది. అదే ప్రయాణం ఇపుడు మళ్ళీ ఇలా ప్రారంభిస్తున్నాను. 

ఈ 'ప్రయాణం'లో నేను చెప్పదలచుకున్నవి, నేర్చుకోదలచుకున్నవి అన్నీ వీలైనపుడల్లా వ్రాస్తాను. నాకు వ్రాయడం నేర్పిన బ్లాగు ప్రపంచానికి నేను చెప్పేవి, నా అనుభవాలు ఏ మాత్రం ఉపయోగపడినా సంతోషం. ఏ ఒక్క పోస్టు ఎవరినైనా ఆలోచింపజేసినా, ప్రభావం చూపినా సంతోషమే. ఈ బ్లాగు ప్రపంచంలో ఇబ్బంది పెట్టేవారే కాదు, నేను వ్రాసినా చదివే వారూ, అభిప్రాయాలు పంచుకునేవారూ ఉన్నారు. అందుకే ఈ టపాకు 'నేనూ చెప్పదలచుకున్నాను' అని హెడింగ్ ఉంచాను. సో.... నేనూ చెప్పదలచుకున్నాను. బాగున్నవి స్వీకరించండి. బాగాలేనివి కామెంట్ ద్వారా చెప్పండి.
- పల్లా కొండల రావు,
7జులై,2018